సామాన్యుడికే మేయర్ పట్టం
కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం

డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు
మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన మాసం గణేశ్, శ్రీలేఖ
డిప్యూటీ మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన సోమిడి వేణు
ఏకగ్రీవంగా ఆమోదించిన బీజేపీ కార్పొరేటర్లు
ఏబీవీపీ నుండి మొదలైన కొలగాని ప్రస్థానం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర
కార్యకర్త నుండి మేయర్ దాకా కొలగాని ప్రస్తానం
రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ‘‘మేయర్’’ పదవి సామాన్యుడికే దక్కింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ అభ్యర్ధిగా 2వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ గా మాజీ మేయర్ సునీల్ రావును ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఈ మేరకు వారి పేర్లను ఖరారు చేస్తూ లేఖపై సంతకం చేశారు.
బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి ఆ లేఖతో కూడిన కవర్ ను తీసుకుని ఈరోజు ఉదయం కరీంనగర్ కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని వి.కన్వెన్షన్ లో బీజేపీ కార్పొరేటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా బీజేపీ కరీంనగర్ జిల్లా ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల సమక్షంలో డాక్టర్ మనోహర్ రెడ్డి హైకమాండ్ ఖరారు చేసిన పేర్లను కార్పొరేటర్లకు తెలియజేస్తూ వారి అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
ఈ సందర్భంగా 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్ మేయర్ అభ్యర్ధిగా కొలగాని శ్రీనివాస్ పేరును ప్రతిపాదించగా, 62వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ బలపర్చారు. అట్లాగే డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా సునీల్ రావు పేరును 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ ప్రతిపాదించగా, 51వ డివిజన్ కార్పొరేటర్ భండారి వేణు బలపర్చారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, వాసాల రమేశ్ సహా బీజేపీ కార్పోరేటర్లందరూ కొలగాని శ్రీనివాస్, సునీల్ రావు పేర్లను మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధులుగా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక బస్సులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు విచ్చేసిన కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం చేశారు.
వడబోసిన హైకమాండ్
వాస్తవానికి కరీంనగర్ మేయర్ పదవిపై బీసీ కార్పొరేటర్లంతా ఆశలు పెట్టుకున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకున్న జిల్లా నాయకత్వం బీసీ, జనరల్ స్థానాల్లో గెలుపొందిన బీసీ కార్పొరేటర్ల పేర్లను, వారి బయోడేటాను రాష్ట్ర నాయకత్వానికి పంపింది. ఆ జాబితాలో ఉన్న ఒక్కో కార్పొరేటర్ పేరును, పార్టీకి చేసిన సేవలు, ప్రజల్లో ఉన్న పేరును పరిశీలించింది. చివరకు అంచలంచెలుగా ఎదిగిన సామాన్య కార్యకర్త కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది.
షాక్ లో కొలగాని…
వాస్తవానికి మేయర్ అభ్యర్ధి పదవి తనను వరిస్తుందని కొలగాని శ్రీనివాస్ అస్సలు ఊహించలేదు. ఈరోజు ఉదయం బీజేపీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ జిల్లా ఇంఛార్జీ గంగిడి మనోహర్ రెడ్డి కొలగానిని మేయర్ అభ్యర్ధిగా రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిందని తెలియజేయడంతో కొలగాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్పొరేటర్లంతా వచ్చి కొలగానికి అభినందనలు తెలియజేస్తున్న సమయంలోనూ ఆశ్చర్యం, ఆనందంతోపాటు ఆనందంతో చెమర్చిన కళ్లతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కార్యకర్తనైన తనను మేయర్ కు ఎంపిక చేస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. బీజేపీలో కష్టపడి, విధేయతతో పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయనే దానికి తానే నిదర్శనం అని చెప్పారు.
37 ఏళ్ల కొలగాని శ్రీనివాస్ 1989 జూన్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో జన్మించారు. ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ చేసిన కొలగాని చిన్నప్పటి నుండే ఆర్ఎస్ఎస్ లో శాఖలో చురుకుగా పాల్గొనే వారు. 2013లోనే ప్రాథమిక శిక్షను పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే స్వామి వివేకానంద ఆలోచనలతో ప్రభావితమై ఎన్ఎస్ఎస్, ఎన్ వైపీ, ఏక్తా పరిషత్ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
విద్యార్ధి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. 2007 నుండి 2009 వరకు భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేసి యువజన పోరాటాల్లోనూ పాలు పంచుకున్నారు. 2007 నుండి 2009 వరకు ఎన్ఎస్ఎస్ వలంటీర్గా పనిచేసి 2010లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వలంటీర్ అవార్డును అందుకున్నారు. నేషనల్ యూత్ ప్రాజెక్టు చేరి దేశ సేవకు అంకితం కావాలని భావించిన కొలగాని 2009లో అసోంలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ క్యాంప్ కు హాజరయ్యారు. లక్షద్వీప్, బెంగళూరు, యూపీ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హర్యానా, అండమాన్ నికోబార్ లలో నిర్వహించిన అనేక జాతీయ స్థాయి శిబిరాల్లోనూ పాల్గొన్నారు. యువత & పిల్లలతోపాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. ఇప్పటి వరకు 15 సార్లు రక్తదానం చేశారు. 2009 నుండి 2013లో ఏక్తా పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొని ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారు. కొలగాని సేవలకు గాను 2005 లో భాయీజీ సేవా పురస్కార్ (NYP), 2010లో NSS ఉత్తమ వలంటీర్, 2021 – కరోనా కాలంలో అందించిన సేవలకుగాను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా ‘రక్షక్ అవార్డు’లను అందుకున్నారు.
ఇక రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… 2014 నుండి 2019 వరకు BJP మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుండి 2025 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ గా కొనసాగారు. 2021 లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్ గా, 2023 నుండి 2024 వరకు కరీంనగర్ టౌన్-1 కన్వీనర్ గా, 2024 లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025 లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్చార్జ్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు.













