దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి
బీజేపీ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే

నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై నిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి అత్యంత అప్రజాస్వామికమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని విమర్శించారు.
పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అంటే కేవలం బీజేపీపై దాడి చేయడం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడమేనని అన్నారు. పార్టీ కార్యాలయంపై సిరా పోయడం, విధ్వంసానికి పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
దాడి జరుగుతున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ఆందోళనకరమన్నారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని గుర్తించి, వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజకీయ ప్రత్యర్థులను విధానాలతో, ప్రజల తీర్పుతో ఎదుర్కోవాలి తప్ప.. దాడులు, దౌర్జన్యాలు, భౌతిక దాడులతో కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, బీజేపీ ఎక్కడా ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి దాడులను ప్రోత్సహించదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రాజకీయాలను ప్రజల మధ్యే కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని పాలనలో, రాజకీయాల్లో ఆచరించాలి అని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నల్గొండ జిల్లాలో మా బీజేపీ జిల్లా అధ్యక్షుల ఇంటిపై జరిగిన దాడి ఘటనను కూడా రెడ్డబోయిన గోపి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వెళ్తున్న సమయంలో కూడా దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడం, అరెస్టులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అధికార పార్టీకి చెందిన వారు దాడులకు పాల్పడితే పోలీసులు చట్టాన్ని సమానంగా అమలు చేయాలని అన్నారు. లేకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, దానిని చేతకానితనంగా భావించవద్దని రెడ్డబోయిన గోపి హెచ్చరించారు. ఇకపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
బీజేపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టబద్ధంగా, ప్రజల మధ్యనే పోరాటం చేస్తుందని తెలిపారు. దాడులకు పాల్పడేవారికి చట్టపరంగా తగిన సమాధానం చెబుతామని అన్నారు.
రాజకీయ హింసకు స్వస్తి పలకాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులు శ్రీమతి కర్నె హరీష్, మీసా సంజీవ్, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్ నాయక్, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్, గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేష్, కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు రేపాక రామచంద్రం, కొనరావుపేట మండల అధ్యక్షులు మీరాల్కర్ బాలాజీ, చందుర్తి మండల అధ్యక్షులు మోకిలే విజయేందర్, రుద్రంగి మండల అధ్యక్షులు కర్ణ బత్తుల వేణుగోపాల్, వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్, ముస్తాబాద్ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్తో పాటు బీజేపీ జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

