తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం ప్రమాదకరం
తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం పెరుగుతూ, వారి భావజాలాన్ని విద్యావ్యవస్థలో రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని ఆందోళన వ్యక్తమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు.

ఈ తీవ్రమైన అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన రాంచందర్ రావు మాటల్లో..
విద్యావ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు, భవిష్యత్ తరాల ప్రయోజనాలను రక్షించేందుకు సమాజం మొత్తం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చాం.
ఈ సమావేశంలో 354 పేజీల విద్యా కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా ప్రసంగిస్తూ, రాష్ట్ర విద్యావ్యవస్థలోకి వామపక్ష లాబీ తమ కుటిల అజెండాను గుట్టుచప్పుడు కాకుండా ఎలా చొప్పించడానికి ప్రయత్నిస్తుందో వివరించాను.
NEP-2020పై అనవసర షరతులు
నివేదికలోని 46వ పేజీలో, జాతీయ విద్యా విధానం (NEP-2020) గురించి ప్రస్తావిస్తూ “దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే రాష్ట్రంలో స్వీకరించాలి” అని కమిషన్ పేర్కొంది.
జాతీయ విద్యావిధానం అనేది ఎన్నో సంవత్సరాల మేధోమథనం, నిపుణుల సంప్రదింపులు, దేశవ్యాప్త ప్రజాభిప్రాయంతో రూపొందించిన విధానం. అయినప్పటికీ, కొందరు మేధావుల ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్స్ సానుభూతిపరులు తమ ‘సెక్యులర్’ అద్దాల గుండా చూసి మాత్రమే అంగీకరిస్తామని చెప్పడం వారి మేధో అహంకారానికి నిదర్శనం.
సంస్కృత భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు
నివేదికలోని 95వ పేజీలో, సంస్కృత భాషకు పెద్దగా ఉపయోగం లేదని, దానిని నిరుత్సాహపరచాలని కమిషన్ సూచించడం అత్యంత శోచనీయం.
సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదు. అది భారతదేశ సనాతన విజ్ఞానం, తత్వశాస్త్రం మరియు నాగరికతకు మూలస్తంభం. విద్యావ్యవస్థ నుండి మన మూలాలను తొలగించే కుట్రగా దీనిని పరిగణించాల్సి వస్తోంది.

గిరిజన వ్యతిరేక ధోరణి
నివేదికలోని 156వ పేజీలో, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మినీ గురుకులాలను రద్దు చేయాలని సిఫార్సు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఈ విద్యాసంస్థలను రద్దు చేయాలని సూచించడం కాంగ్రెస్ ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను బట్టబయలు చేస్తోంది.
విద్యార్థుల ఆరోగ్యంపై విరుద్ధ సూచనలు
నివేదికలో విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ఒత్తిడి తగ్గించాలి అని చెబుతూనే 239వ పేజీలో రాత్రి 10 గంటలకు టీ ఇవ్వాలని సూచించడం ఆశ్చర్యకరం. ఒకవైపు ఆరోగ్యం గురించి మాట్లాడుతూనే, మరోవైపు రాత్రి వేళల్లో కెఫిన్ తీసుకోవాలని సూచించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉపాధ్యాయులపై కాంగ్రెస్ వక్రదృష్టి
జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయుల జీతాలు మరీ ఎక్కువగా ఉన్నాయంటూ కమిషన్ వ్యాఖ్యానించడం వారి అవగాహనలేమికి నిదర్శనం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుల శ్రమను కించపరచడం తగదు.
నాథుడు లేని అనాథలా తెలంగాణ విద్యాశాఖ
గత రెండేళ్లుగా తెలంగాణ విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి లేకపోవడం ప్రభుత్వ అసమర్థతను చూపిస్తోంది. సరైన నాయకత్వం లేక విద్యావ్యవస్థ దిశాహీనంగా మారింది.
క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి:
- పాఠశాలలు ఉన్నాయి… కానీ ఉపాధ్యాయులు లేరు
- ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు
- ఇద్దరూ ఉన్నచోట మౌలిక సదుపాయాలు లేవు
గ్రంథాలయాల దయనీయ పరిస్థితి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 100 పనిచేసే గ్రంథాలయాలు కూడా లేకపోవడం విద్యావ్యవస్థ పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది.
మధ్యాహ్న భోజన పథకంలో అమానవీయ పరిస్థితులు
మధ్యాహ్న భోజన పథకంలో కూడా తీవ్రమైన లోపాలు బయటపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యార్థులకు ఆహారం చెట్ల కింద, తరగతి గదుల్లో, మరుగుదొడ్ల సమీపంలో, గాలి వెలుతురు లేని షెడ్లలో వండుతున్నారని కమిషన్ నివేదికే పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 7.45 లక్షల మంది చిన్నారులు ఇలాంటి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వండిన ఆహారం తింటున్నారు. ఇది వారి ఆరోగ్యం, భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపే అంశం.

ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఖండన
విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే విధానాలను సహించబోమని స్పష్టం చేసింది.
ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సటీ పీజీఆర్ఆర్ సీడీయి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ విద్యా విధానం-2026పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు,విద్యావేత్తలు,మేధావులు విద్యార్ధి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
