కరీంనగర్ టవర్ సర్కిల్ లో బండి సంజయ్ జోష్..జిలేబీ హోష్!!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మామాజీ జిలేబీ సెంటర్ లో జిలేబీ తిన్నారు. అక్కడే స్థానిక వ్యాపారులతో ముచ్చటించారు. టవర్ సర్కిల్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను తరిమికొట్టాలి
ఆ రెండు పార్టీలకు దేశభక్తి లేనేలేదు
వందేమాతరం గీతాన్ని సోనియా, ఖర్గే అవమానించడమే నిదర్శనం
దేశభక్తిపైనా కాంగ్రెస్ సెన్సార్ విధిస్తోందా?
దేశం మారితే సరిపోదు… దేశం విలువలు, సంస్క్రుతి, వేల ఏళ్ల చరిత్ర తెలిసి ఉండాలి
వందేమాతరం గీతమంటే అంత భయమెందుకు?
ఎంఐఎం నేతల చెవుల్లో రక్తం కారేలా లక్షలాది మందితో సామూహిక వందేమాతరం ఆలపిస్తాం
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
కరీంనగర్ టవర్ సర్కిల్ లో కార్యకర్తలతో కలిసి జిలేబీ తిన్న కేంద్ర మంత్రి

స్థానిక వ్యాపారులతో ముచ్చటించిన బండి సంజయ్
వందేమాతరం గీతాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను ఈ దేశం నుండి తరిమికొట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకు దేశభక్తి లేనేలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే తీరుపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించాలని పార్లమెంట్ లో చట్టం చేసిన తరువాత మధ్యలో ఆపేసి చట్టాన్ని ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. ‘‘ఇటలీ నుండి ఎల్లలు దాటి భారత్ కు వస్తే సరిపోదని, ఈ దేశ వేల ఏళ్ల చరిత్ర, పోరాటాలు, విలువలు, సంస్క్రుతి, సాంప్రదాయాలను కూడా తెలుసుకుని ఆచరిస్తేనే దేశభక్తి ఉన్నట్లు’’అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఈరోజు సాయంత్రం కరీంనగర్ టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. హైలైట్స్…
వందేమాతరం ఆలపించకుండా సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం. వారి వ్యవహార శైలిని చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది సిగ్గు చేటు. వందేమాతరం బీజేపీకో, వ్యక్తికో సంబంధించినది కాదు. ఈ దేశానికి గౌరవం ఇవ్వడం.
ఆనాడు బ్రిటీష్ వాళ్లు వందేమాతరం గీతాన్ని చూసి భయపడింది. ఈనాడు కాంగ్రెసోళ్లు వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి వణికిపోతోంది. వందేమాతరం గీతంతో బ్రిటీషర్లను తరిమికొట్టిన చరిత్ర ఉంది.
సోనియాగాంధీ ఇటలీ నుండి ఎల్లలు దాటి భారత్ కు వచ్చినంత మాత్రాన దేశ భక్తి అన్పించుకోదు. ఈ దేశ వేల ఏళ్ల చరిత్ర, సంస్క్రుతి, విలువలను తెలుసుకుని పాటించడమే దేశభక్తి. మేమే స్వాతంత్య్రం తెచ్చామని గప్పాలు కొట్టే కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి ఒకసారి స్వాతంత్య్రం కోసం పోారాడి బలిదానాలు చేసిన చరిత్రను చెప్పంి.

కాంగ్రెస్ పార్టీ దేశభక్తిపైనా సెన్సార్ షిప్ విధిస్తోందా? ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి కాదు. ఈ దేశంలో జాతీయ పతాకం కోసం, వందేమాతరం కోసం ఉద్యమాలు చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. వందేమాతరాన్ని అవమానించడమే మహనీయులను అవమానించడమే.
వందేమాతరాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటే ఎంఐఎం పార్టీ ఏకంగా బహిష్కరిస్తోంది. ఈ రెండు పార్టీలకు దేశభక్తి లేదు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
పార్లమెంట్ లో చట్టం చేసిన తరువాత వందేమాతరం గీతాన్ని అడ్డుకోవడం ముమ్మాటికీ అవమానించడమే. ఎంఐఎం నేతలు సైతం వందేమాతరం గీతాలాపనను మళ్లీ అవమానిస్తే… ఈసారి హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దే లక్షలాది మందితో సామూహికంగా వందేమాతరం ఆలపిస్తాం. చెవుల్లో దూది పెట్టుకున్నా గీతం వినపడేలా చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.
ఎంఐఎం పార్టీకి వందేమాతరం గీతాన్ని ఆలపించాలనే దేశభక్తి లేదు. గతంలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే… నల్ల జెండాలు పట్టుకునే నిరసన తెలిపిన నీచమైన చరిత్ర ఎంఐఎం నేతలది. ఆనాడు ఎంఐఎం నేతలకు ఏ విధమైన గుణపాఠం చెప్పామో మీ అందరికీ తెలుసు. ఎంఐఎం అధినేత ఒవైసీ కాలేజీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. గతంలో ఉగ్రవాది ఆ కాలేజీలో పట్టుబడ్డ విషయం మీ అందరికీ తెలుసు. అట్లాంటి ఎంఐఎంతోపాటు ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ ను కూడా ఈ దేశం నుండి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది.
