హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సమయంలో అమలుకు ఆమడ దూరంలో ఉన్న అనేక హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురిచేసి, అమాయక ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది.
అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో ఊరూరా తిరుగుతూ ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, తాము ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం నెరవేరుస్తామని పదేపదే ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనను పూర్తిగా పక్కన పెట్టి, హామీల అమలును విస్మరించి డైవర్షన్ రాజకీయాలతో ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రైతులందరూ బ్యాంకుల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోమని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తిగా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాల పేరుతో కేవలం కొందరికే రుణమాఫీ చేసి, లక్షలాది మంది రైతాంగాన్ని మోసగించింది.
ఫ్రీ బస్సు పథకం కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఒక్క ఆటో డ్రైవర్కు కూడా ఒక్క పైసా ఇవ్వకుండా, పైగా ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
యువ వికాస్ పేరిట రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ₹5 లక్షలు అందిస్తామని ప్రకటించిన పథకం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15 నుండి 16 లక్షల మంది యువకులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, నేటి వరకు అమలు కాలేదు.
రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు ₹2,500 అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం పై కనీస స్పందన కూడా చూపలేదు. అలాగే పెళ్లి చేసుకోబోయే ప్రతి ఆడబిడ్డకు ఒక తులం బంగారం ఇస్తామని ప్రకటించినా, తులం కాదు కదా అర తులం కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది.
పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు వెన్నెముకగా నిలిచిన స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని విడుదల చేయకుండా విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది.
కౌలు రైతులకు సంవత్సరానికి ₹10,000 అందిస్తామని ప్రకటించిన హామీ ప్రకటనకే పరిమితమైంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధును రైతు భరోసాగా మార్చి, ప్రతి ఎకరానికి సంవత్సరానికి ₹15,000 చెల్లిస్తామని చెప్పినా, ఒక విడతరైతు భరోసా ఎగవేసి, అనంతరం కూడా కేవలం రెండు, మూడు ఎకరాల వరకే చెల్లించి ప్రభుత్వం సరిపుచుతున్నది.
రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ప్రతినెల ₹3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేసింది.
నోటిఫికేషన్ల కోసం ఉద్యమాలు చేస్తున్న నిరుద్యోగ యువతను అణచివేయడమే కాకుండా, వారిపై కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నది..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకుండా, ముఖ్యమంత్రే స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థులకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. కార్పొరేట్ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకుంటున్నా, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురాకుండా ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కైందనే విమర్శలను మూటగట్టుకుంది.
రాష్ట్రంలో చదువుతున్న దాదాపు 40లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 15వేల కోట్లు పెండింగ్ లో పెట్టింది.గతంలో కేసీఆర్ 6వేల కోట్లు పెండింగ్ పెట్టిన విధంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.సర్టిఫికెట్ల కోసం కాలేజీల యాజమాన్యాలు ఫీజులు కట్టమని విద్యార్థులపై వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి.ప్రభుత్వం బకాయిలు విడుదల చేయని కారణంగా మేనేజ్మెంట్స్ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి..పై చదువులు చదువాలన్నా..ఉద్యోగాలకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు తప్పనిసరి కాబట్టి విద్యార్థులు,తల్లిదండ్రులు కాలేజీల చుట్టూ తిరుగుతూ యాజమాన్యాలను బ్రతిమిలాడాల్సిన పరిస్థితి వచ్చింది.అటు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయక,ఇటు విద్యార్థులనుండి వసూల్ చేసుకోకపోతే మేం ఎలా సంస్థలను నడపాలి అని యాజమాన్యాలు వాపోతున్నాయి.రేవంత్ రెడ్డి మాత్రం కమిషన్లు వచ్చే ప్రాజెక్టులను ముంగటపెట్టి విద్యార్థులకు,నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తున్నాడు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ,ఇతర సంఘాలు,పార్టీలు పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కారించాలి.లేకపోతె జెన్ జీ ఉద్యమాలు హైదరాబాద్ లో కూడా ప్రారంభమై రేవంత్ రెడ్డీ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
అదే విధంగా రాష్ట్రంలోని అనేక కళాశాలలు ఒకే కళాశాల పేరుతో అనుమతులు తీసుకొని, వివిధ స్థలాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
వసతి గృహాలు, గురుకులాల్లో నాణ్యమైన భోజనం, తాగునీటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్కు గురై ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి స్పందించే తీరిక లేదు. కామన్ డైట్ మెనూ పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు హాస్టళ్లలో ఒక రోజు బస చేసి మీడియా ముందు ఫోజులు ఇచ్చి పత్రికల్లో ఫోటోలు ప్రచురించుకోవడం తప్ప, నేటి వరకు కామన్ డైట్ మెనూను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు.
వృద్ధాప్య మరియు దివ్యాంగుల పెన్షన్లను ₹2,000 నుంచి ₹4,000కు, ₹4,000 నుంచి ₹6,000కు పెంచుతామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు.
అలాగే హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించారనే కారణంతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను, కనీసం ఇంట్లోని సామాన్లు బయటకు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. అయితే కొందరు బడా బాబుల ఇళ్లు లేదా ప్రభుత్వ కార్యాలయాలు ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించిన తెలంగాణ ప్రజలను నట్టేట ముంచకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పని చేయాలని ప్రజల కోరిక…..
హరీష్ సాగర్
(ఎబివిపి నాయకులు)
6302758830
